హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ విద్యను స్కిల్యూనివర్సిటీకి అనుసంధానించేలా విడుదల చేసిన జీవో 97పై సమగ్ర పరిశీలన పూర్తయ్యేంతవరకు తదుపరి చర్యలను నిలిపివేయాలని, ఆ జీవోను అమలు చేయొద్దని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) స్పష్టం చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ చీఫ్ కవిత ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ సభ్యులు శనివారం కేకే కమిటీని కలిసి రిపోర్ట్ అందజేశారు. సమగ్ర విచారణ జరిగేవరకు ప్రస్తుతం ఉన్న సాంకేతిక విద్యావిధానం, ఎస్ బీటీఈటీ వ్యవస్థ పరిధిలోనే కొనసాగించాలని తమ నివేదికలో కమిటీ కోరింది.
ప్రస్తుతం ఉన్న డిప్లొమా అర్హతల గుర్తింపును, ఈసెట్, లాటరల్ ఎంట్రీతో సహా ఉన్నత విద్య కోసం ఉన్న అన్ని మార్గాలను రక్షిస్తామని స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పేర్కొంది. పాలిటెక్నిక్ విద్య సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని, విద్యార్థుల ఫీజులను ఇష్టానుసారంగా పెంచొద్దని సూచించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థులకు ఇచ్చే ప్రయోజనాలు యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. పాలిటెక్నిక్ భూములు, భవనాలు ఇతర ఆస్తులకు సంబంధించి చట్టపరమైన అనుమతులు లేకుండా వాణిజ్య, ప్రైవేట్ ప్రయోజనాల కోసం మళ్లించొద్దని కోరింది.
